గీతంలో త్యాగరాజ ఆరాధన

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్- లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో సోమవారం త్యాగరాజ ఆరాధన – 2026 వేడుకలను సంగీత కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించి, ఆయనకు ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కర్ణాటక సంగీతాన్ని ఓపెన్ ఎలక్టివ్ గా, మైనర్ ప్రోగ్రామ్ గా ఎంపిక చేసుకున్న విద్యార్థులు త్యాగరాజ కీర్తనలను హృద్యంగా ఆలపించారు. వారికి వయోలిన్ పై మహావాది వాసు, మృదంగంపై ఎం.చంద్రకాంత్ సహకారం అందించగా, వారి సహకారం ప్రదర్శన ఆధ్యాత్మిక లోతును, సంగీతంపై శ్రద్ధను పెంచాయి.

తొలుత ఈ ప్రదర్శన ఆనందు మురళి, మృదు రవళిల ‘ఎందరో మహానుభావులు..’తో ఆరంభమై, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆ తరువాత మృదు రవళి ఒంటరిగా ‘నమో నమో రాఘవ’, ‘మనవ్యాలకించర..’, ‘బాల కనక మయా..’, ఆ తరువాత చారుకేశి రాగం, అంతకు మించి ఆలాపన, తాళం, పల్లవిల మేళవిందు, వాద్య సహకార జుగల్ బందీతో అలరించారు. ‘ఆడమోదిగలడే..’, ‘హరిదాసులు వెడలె ముచ్చటకని..’ వంటి చక్కని పాటలతో ప్రేక్షకులను మైమరించారు.

ఇక విద్యార్థులు ‘రామా కోదండ రామా.. కళ్యాణ రామా..’, గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా..’ ప్రదర్శనలు ప్రేక్షకుల మన్ననలను చూరగొని, కరతాళ ధ్వనులతో వేదిక మార్మోగింది. ఈ ప్రదర్శనలు త్యాగరాజ కవి యొక్క ఆధ్యాత్మిక లోతును, సంగీత వారసత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయి.శాస్త్రీయ సంగీతం, నృత్యం, సంప్రదాయాన్ని మేళవించి, నిర్వహించిన ఈ ఆరాధన సుసంపన్నమైన సాంస్కృతిక అనుభవాన్ని అందించడమే గాక, మనదేశ గొప్ప కళాత్మక వారసత్వాన్ని కాపాడటానికి గీతం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది.లలిత, ప్రదర్శన కళల విభాగం సమన్వయకర్త డాక్టర్ వై.లలితా సింధూరి పర్యవేక్షణలో, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆనందు మురళి, దర్భా మృదురవళి ఈ ఆరాధనా కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *