శాసనమండలి మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు
పటాన్చెరు
60 లక్షలకు పైచిలుకు సభ్యత్వంతో టిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల ప్రాంతీయ పార్టీగా నిలుస్తోందని శాసన మండలి మాజీ చీఫ్ విప్ బొడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమైన పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నెలాఖరు లోపు ముగుస్తుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గ్రామం నుండి పట్నం వరకు అన్ని స్థాయిల్లో పార్టీ నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికే 80 శాతం కమిటీలు పూర్తి అయినట్లు తెలిపారు. 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు మండల, మున్సిపల్ కమిటీల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
కష్టపడే ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంటుందనీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు బక్కి వెంకటయ్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ కృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.