2 కోట్ల 8 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి,
షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. నియోజకవర్గ పరిధిలోని జిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు, రామచంద్రాపురం రెవెన్యూ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలు, వార్డులు, డివిజన్లకు సంబంధించిన 208 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అతి త్వరలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాబోతోందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో పథకం కొనసాగుతుందని తెలిపారు. ఇళ్ల విషయంలో దళారులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు, ఆయా మండలాల తహసిల్దార్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సోమిరెడ్డి, పరమేశ్ యాదవ్, లబ్దిదారులు పాల్గొన్నారు.