మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో గల పాఠశాలల స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సీఎం కప్ క్రీడోత్సవాలు నిర్వహిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ 2025-2026 పటాన్చెరు నియోజకవర్గస్థాయి క్రీడలను క్రీడాజ్యోతి వెలిగించి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడల అభివృద్ధికి అనునిత్యం అండగా నిలుస్తూ వారు అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నానని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం వివిధ క్రీడా అంశాలలో మైత్రి మైదానం వేదికగా జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల స్థాయి క్రీడల్లో ఎంపికైన 400 మంది విద్యార్థులు నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సిఐ వినాయక రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారులు నాగేశ్వరరావు నాయక్, రాములు, సుధాకర్, విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
