అట్టహాసంగా ఆరంభమైన జాతీయ హ్యాండ్‌బాల్‌ టోర్నీ

Hyderabad politics Telangana

మనవార్తలు,హైదరాబాద్:

హైదరాబాద్‌ మరో జాతీయస్థాయి టోర్నీకి వేదికైంది. స్థానిక సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా జాతీయ 50వ మహిళల సీనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మొత్తం 32 జట్లు పోటీపడుతున్న టోర్నీ వచ్చే నెల 3 తేదీ వరకు జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ క్రీడలకు పెద్దపీట వేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

దేశంలో ఎక్కడలేని విధంగా త్వరలో అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకురాబోతున్నామని మంత్రి వివరించారు. జాతీయ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌(హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హ్యాండ్‌బాల్‌ టోర్నీని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ట్రిపుల్‌ ఒలింపియన్‌ ముకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పోటీల తొలి రోజు బరిలోకి దిగిన తెలంగాణ 27-12 తేడాతో పుదుచ్చేరిపై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 17-4 ఆధిక్యం కనబరిచిన తెలంగాణ..అదే జోరుతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *