పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు అందించాలన్న సమన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సిఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటుచేసిన పటాన్చెరు మండల, డివిజన్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం క్రీడా రంగానికి ప్రభుత్వం తగు ప్రాధాన్యత అందించడంతోపాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు వెన్నంటే నిలుస్తోందని అన్నారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు యువతకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మండల స్థాయిలో రాణించిన వారిని జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసే అవకాశం ఉండడంతో తమ ప్రతిభను చాటేందుకు యువతకు మంచి అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడాకారుల కోసం మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఏడు కోట్ల రూపాయలతో పటాన్చెరు పట్టణంలో నిర్మించిన మైత్రి మైదానం జిల్లా రాష్ట్రస్థాయి క్రీడలకు వేదికగా నిలుస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తాసిల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఎంఈఓ రాథోడ్, సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మండల అధ్యక్షులు పాండు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *