_జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభమైన గీతం వార్షిక విద్యార్థి ఉత్సవం ‘ప్రమాణ’
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
‘ప్రతిభ గొప్పగా మాట్లాడుతుంది. అది బాహ్యమైన వాటి కంటే చాలా ముఖ్యమైనది. ఒక మహిళగా నేను నా సామర్థ్యాలతో శక్తివంతంగా భావిస్తున్నాను’ అని అపోలో ఆస్పత్రుల సామాజిక సేవ (సీఎస్ఆర్) ఉపాధ్యక్షురాలు ఉపాసన కామినేని కొణిదెల అన్నారు.హైదరాబాద్. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రతిఏటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృతిక (టెక్నో, కల్చరల్ ఫెస్ట్) పండుగను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఆడ, మగ అనే లింగ భేదం లేకుండా, విశేషమైన విజయాల కోసం కృషిచేయాలని, తమ అత్యుత్తమ ప్రదర్శనకు తమను తాము సన్నద్ధం చేసుకోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు.
ఈ ప్రారంభోత్సవంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ గడ్డం వంశీకృష్ణ తన స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. వ్యక్తులకు అందుబాటులో ఉన్న అపరిమితమైన అవకాశాలను ఎత్తిచూపారు. హద్దులను అధిగమించి ఆయా వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులను అనుగుణంగా జీవితంలో రాణించాలని హితవు పలికారు. ఎలక్ట్రికల్, మేనేజ్ మెంట్ నేపథ్యం ఉన్న తాను సౌరశక్తి రంగంలో ఉన్న అభిరుచితో సౌర పైకప్పును రూపొందించి, మేథో హక్కు (పేటెంట్) పొందానని, అలాగే ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో ఉన్న ఆసక్తిమేరకు ఓ ఎలక్ట్రికల్ బెక్ ను రూపొందించి మనదేశంలో ఆరు పేటెంట్లు పొందినట్టు చెప్పారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, ప్రమాణ- 2024 అధ్యాపక సలహాదారు ప్రొఫెసర్ పి.త్రినాథరావు, స్టూడెంట్ లైఫ్ అధికారులు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమూనా ఐక్యరాజ్య సమితి శిక్షణ కార్యశాల, ఆర్కిటెక్చర్ నమూనాల ప్రదర్శన, బ్యాండ్ల పోటీ, ట్రెజర్ హంట్, సంగీతం, నృత్య ప్రదర్శనలతో సహా అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలతో గీతం విద్యార్థులు ప్రమాణ ఫెస్ట్ కు వన్నెలద్దారు. ఈ పండుగతో పాటు సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవాన్ని కూడా విద్యార్థులు నిర్వహించారు. సీతాకోక చిలుకల్లా కలియ తిరుగుతున్న విద్యార్థులతో గీతం ప్రాంగణమంతా పండుగ శోభను సంతరించుకుంది. ప్రమాణ-2024 అన్ని హద్దుల దాటిన ప్రతిభా స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, సృజనాత్మకత, ఆవిష్కరణ, కలుపుకుపోయే వేడుకగా కొనసాగుతోంది.