రామచంద్రపురం
నేటి తరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని గీతా భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాలలో అరబిందో ఫార్మా సహకారంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా గీత భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా నేడు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సైతం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. కేజీ టు పీజీ విద్య విధానంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికే పటాన్చెరు నియోజకవర్గంలో పీజీ కళాశాల తరగతులు సైతం ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు.
తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని కోరారు. శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 29వ తేదీన మంత్రి హరీష్ రావు చేతులమీదుగా మరోసారి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.