పటాన్చెరు:
ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రతి విద్యార్థి తమ తమ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు వీడియో సందేశం అందించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాల, కళాశాలను శానిటేషన్ చేయడంతో పాటు తరగతి గది లోకి ప్రవేశించే ముందు ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించడం తో పాటు, మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలకు ఇప్పటికే థర్మల్ స్కానర్ తో పాటు శానిటైజర్ పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కరోనా మూలంగా గత సంవత్సరన్నర కాలంగా విద్యార్థులు ఇంటికి పరిమితం కావడంతో పాటు ఆన్లైన్ క్లాసులు ద్వారా విద్యను అభ్యసించడం జరిగిందని తెలిపారు. వైద్యశాఖ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థను ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ధైర్యంగా పాఠశాలలకు వెళ్లి విద్యను అభ్యసించాలనీ ఆయన మరోమారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మండల విద్యాధికారి పాండురంగం రాథోడ్ పాల్గొన్నారు.