ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి

Lifestyle Telangana

_మహిళా దినోత్సవంలో సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ విష్ణుప్రియ సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సమాజహితం కోరి చేసే ఏ పనినైన , మరొకరి సాయం కోసం ఎదురు చూడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించాలని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఆర్. విష్ణుప్రియ సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ మహిళా దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమెన్ లీడర్స్ ఫోరమ్, ఈ-క్లబ్, జీ-స్టూడియో, స్టూడెంట్ లైఫ్ సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ విష్ణుప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను ఆమె విద్యార్థులతో పంచుకున్నారు. వరికి 1998లో వచ్చిన తెగులును అధిగమించి, అధిక దిగుబడి, పోషక విలువలతో కూడిన వంగడాన్ని రూపొందించడంలో ఎదురైన కష్టనష్టాలను డాక్టర్ విష్ణుప్రియ వివరించారు.

ఆత్మవిశ్వాసం ప్రాముఖ్యత, సవాళ్లను అధిగమించడంలో నిరంతర అభ్యాసం ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు వారి వారి అభిరుచులను దృఢ నిశ్చయంతో కొనసాగించేలా ఆమె ప్రేరేపించారు. ప్రతి ఒక్కరూ తమకు సమీపంలోని ఒక బాలికను గుర్తించి మార్చగలితే, ప్రపంచమే మారిపోతుందన్న విశ్వాసాన్ని విష్ణుప్రియ వ్యక్తపరిచారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న పోషకాహార నిపుణురాలు, డైటీషియన్ శుభాంగి తమ్మాళ్వార్, పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనం, నిత్య జీవనంలో అవసరమైన శారీరక వ్యాయామం గురించి చెబుతూ, వాటిని ఆహుతులతో చేయిస్తూ కార్యక్రమాన్ని సజీవం చేశారు. సమతుల ఆహారం సమయానికి తినాలని, పండ్లు, పండ్ల రసాలను విరివిగా తీసుకోవాలని, శీతల పానీయాలను దరిచేరనీయొద్దని, టీ, కాఫీ వంటివి అలవాటు ఉన్నవారు, రోజులో రెండుసార్లు. మాత్రమే తీసుకోవాలని, అవి తాగేటప్పుడు ఎటువంటి ఘనాహారం తీసుకోవద్దని ఆమె సూచించారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, గాత్రం, అభినయాలతో పాటు గ్రామీణ భారతంలో మహిళా కార్మికులపై నివేదిక సమర్పణలో విద్యార్థినులు తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. వెంచర్ డెవలప్మెంట్ కోచ్ ఎస్ వీసి యామిని, తమ కంపెనీలో ఓ ఉద్యోగి నియామకంలో మహిళకా, లేదా పురుషుడికి ప్రాధాన్యం ఇవ్వాలా అన్న అంశంలో ఎదుర్కొన్న సంకటాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టీమాధవి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమం, మహిళా విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎన్.ప్రసన్నలక్ష్మి వందన సమర్పణతో ముగిసింది. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ. పలువురు అధ్యాసకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *