గీతంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు ఈనెల 18, 20 తేదీలలో రెండు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనుంది. సాంకేతిక నైపుణ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు, స్కాలర్ల పరిశోధనా నైపుణ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ (ఏఐ & డీఎస్) విభాగం ఆధ్వర్యంలో ఈనెల 18న ‘అనిశ్చితిలో డేటా-ఆధారిత నిర్ణయం తీసుకోవడం’ అనే అంశంపై డాక్టర్ బిస్మార్క్ సింగ్ ఆతిథ్య ఉపన్యాసం చేయనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల విశ్లేషణాత్మక, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా, మధ్యాహ్నం అధ్యాపకులు, పరిశోధనా స్కాలర్ల కోసం పరిశోధనపై చర్చాగోష్ఠిని నిర్వహిస్తున్నామని, వీటిని డాక్టర్ చంద్రశేఖర్ ఉద్దగిరి సమన్వయం చేస్తారని వెల్లడించారు.తన విద్యా కార్యక్రమాలను మరింత విస్తరిస్తూ, గీతం ఫిబ్రవరి 20, 21 తేదీలలో ‘క్వాలిటీ బై డిజైన్ (క్యూబీడీ): ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ప్రయోగాల రూపకల్పన (డీవోఈ)ను సమగ్రపరచడం’ అనే అంశంపై రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి, విశ్లేషణాత్మక శాస్త్రాలు, నాణ్యత హామీ, నియంత్రణ శాస్త్రం వంటి ఔషధ పరిశోధన యొక్క వివిధ దశలలో డీవోఈ, గణాంక సాధనాల వినియోగంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుందన్నారు. విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణుల మధ్య అర్థవంతమైన పరస్పర చర్య, జ్జాన మార్పిడి కోసం ఒక క్రియాశీలక వేదికను అందించడం ఈ కార్యక్రమ లక్ష్యమని, దీనిని డాక్టర్ పవన్ కుమార్ చింతమనేని సమన్వయం చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమాల ద్వారా, పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను పెంపొందించడానికి, అంతర్ విభాగ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి గీతం హైదరాబాద్ తన నిబద్ధతను కొనసాగిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *