పటాన్ చెరు:
నేత్ర వైద్యంలో ప్రస్తుతం భారతీయులే అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని, పశ్చిమ దేశాలు కూడా మననెపై చూస్తున్నాయని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లోని బ్రయిన్ హోల్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్తోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్ డెరైక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ శ్రీకాంత్ ఆర్.భరద్వాజ్ చెప్పారు. పటాన్ చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆస్తోమెట్రీ తొలి బ్యాచ్ ను సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్ళ క్రితం మనవద్ద అస్తోమెట్రీ కోర్సు సంస్థాగతంగా లేదని, ప్రస్తుతం పరిశోధన, వైద్య సేవలు, అత్యాధునిక సేవలతో పశ్చిమ దేశాలే మనవైపు చూసే స్థితికి చేరుకున్నట్టు విద్యార్థుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. అప్తోమెట్రీ కోర్సు పూర్తిచేసిన వారికి అపార అవకాశాలున్నాయని, వృత్తి నిపుణులుగా ఎదగొచ్చని, పీజీతో పాటు పీహెచ్ డీ కూడా చేసి పరిశోధకులుగా రాణించవచ్చని ఆయన చెప్పారు.

గీతం – ఎల్వీ ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన ఈ కోర్సు విశ్వంలోనే అత్యుత్తమమైనదిగా ఆయన పేర్కొన్నారు. పారామెడికల్ కోర్సుల వలె కాకుండా ఫిజియో థెరఫీ, అష్తోమెట్రీ చేసిన విద్యార్థులు సొంతంగా క్లినిక్అను స్థాపించి, వైద్యసేవలు అందించవచ్చని డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు. సభాధ్యక్షత వహించిన గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్. శివప్రసాద్ మాట్లాడుతూ సనాళ్ళతో పాటు సేవాభావంతో కూడుకున్న ఈ కోర్సులో చేరిన విద్యార్థులను అభినందించారు. మనదేశంలోని కంటి డాక్టర్ల కొరత విపరీతంగా ఉందని, పదివేల జనాభాకు ఒక్క క్షేత్ర వెద్యుడే ఉన్నాడని, ఆ లోటు ఆప్తోమెట్రీ పూర్తిచేసిన వారు భర్తీ చేయగలరని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బాలాజీరావు రావూరి స్వాగతోపన్యాసం చేయగా కోర్సు సమన్వయకర్త డాక్టర్ ఉపేంద్ర మెండు వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది. గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, బ్రయిన్ హోల్డన్ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రార్ డాక్టర్ విజయ్, బీ.ఆస్తోమెట్రీ విద్యార్థులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
