నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కార్మికులు, సూపర్వైజర్లకు విశేష సన్మానం
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :
నగర పరిశుభ్రతకు అహర్నిశలు శ్రమిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ భారతి నగర్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు . కార్మికుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో పని చేస్తున్నారని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి అన్నారు .
ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ శ్రీ వి. రవి కిరణ్ రెడ్డి నిర్వహించగా, ముఖ్య అతిథులుగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఆధర్శ్ రెడ్డి , భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో అతిథులు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ప్రతి కాలనీ నుంచి విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ, పరిశుభ్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అలాగే పారిశుద్ధ్య వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ, విధుల పర్యవేక్షణ, పనుల సమన్వయం, సమయపాలన వంటి అంశాలలో ఆదర్శంగా నిలుస్తున్న పారిశుద్ధ్య సూపర్వైజర్లను ప్రత్యేకంగా సన్మానించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ ఆధర్శ్ రెడ్డి మాట్లాడుతూ “పారిశుద్ధ్య కార్మికులు క్షేత్రస్థాయిలో నిత్యం శ్రమిస్తే, సూపర్వైజర్లు మొత్తం వ్యవస్థను సమన్వయం చేస్తూ విధులు సక్రమంగా అమలయ్యేలా చూస్తున్నారు. నగర పరిశుభ్రతకు వీరిద్దరి పాత్ర కీలకం. వీరి సేవలను గౌరవించడం సమాజ బాధ్యత” అని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సంక్షేమానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆధర్శ్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణలో ముందువరుసలో నిలుస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలకు గౌరవం ఇవ్వడం మాత్రమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు. డివిజన్ను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో పారిశుద్ధ్య సిబ్బంది కృషి మరువలేనిదని ఆమె కొనియాడారు.అనంతరం ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో, శ్రీమతి సత్యవతి గారి నిర్వహణలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. మహిళా సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను మరింత శోభాయమానంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికులు మరియు సూపర్వైజర్ల సేవలకు సముచిత గౌరవం లభించిందని, వారి ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని నాయకులు, పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఐజీ కాలనీ అధ్యక్షుడు శ్రీ యాదగిరి రెడ్డి , డైరెక్టర్లు శ్రీ లక్ష్మణ్ , శ్రీ సామ్యూల్ జాన్ , మాజీ అధ్యక్షుడు శ్రీ నారాయణ రెడ్డి , బీఆర్ఎస్ యూత్ సర్కిల్ అధ్యక్షుడు శ్రీ నరసింహ , యూత్ నాయకులు శ్రీ మహేష్ , శ్రీ విజయ్ , శ్రీ రాజు , పారిశుద్ధ్య సూపర్వైజర్ శ్రీ కేశవ్ , పారిశుద్ధ్య సిబ్బంది శ్రీ అనిల్ , శ్రీ జిలానీ , శ్రీమతి సవిత తదితరులు పాల్గొన్నారు.
