పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన గానంతో, ధూమ్ ధామ్ పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు, గొప్ప నాయకుడిగా ఎదిగే క్రమంలో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభలో అంతా తానై తన పాటలతో ప్రజలందరినీ చైతన్యపరచడంతో పాటు, పటాన్చెరులో ఏ కార్యక్రమం నిర్వహించిన అన్న నేను వస్తానంటూ ఆప్యాయంగా కార్యక్రమాలకు హాజరయ్యే వాడని గుర్తు చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం గొప్ప కళాకారుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
