మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఎస్.ఆర్.జితేష్ కుమార్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘హైఫనేటెడ్ విశ్లేషణాత్మక పద్ధతులు, క్యూబీడీ వినియోగించి కోలెసెవెలామ్ హెచ్సీఎల్, బిక్టెగ్రావిర్, ఎల్విటెగ్రావిర్, వోరికోనజోల్ లలో కొత్త మలినాల నిర్ధారణ, ధ్రువీకరణ’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.కోటేశ్వరరావు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధన వినూత్నమైన, తక్కువ ఖర్చుతో కూడిన, నియంత్రణలకు అనుగుణమైన విశ్లేషణాత్మక పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్టు వెల్లడించారు. ఈ అధ్యయనం, ఉత్పరివర్తన ప్రమాదాలకు సంబంధించిన కీలకమైన భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరిస్తూ, ముఖ్యమైన ఫార్మాస్యూటికల్ మందులలోని నూతన, జన్యువిషపూరిత మలినాలను గుర్తించి, వాటి పరిమాణాన్ని నిర్ధారించడానికి HPLC-MS/MS, LC-MS, and GC-MS వంటి అధునాతన సాంకేతిక పద్ధతులతో పాటు, ప్రయోగాల రూపకల్పన (డీవోఈ), రూపకల్పన ద్వారా నాణ్యత (క్యూబీడీ) సూత్రాలను ఉపయోగిస్తుందని వివరించారు.ఈ పరిశోధన, సంక్లిష్ట ఔషధ పదార్థాలలో మలినాల నిర్ధారణ కోసం పటిష్టమైన, ధ్రువీకరించిన పరిష్కారాలను అందిస్తూ, ఔషధ నాణ్యత, భద్రతకు గణనీయంగా దోహదపడుతుందన్నారు.డాక్టర్ జితేష్ కుమార్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
