16 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నూతన భవనం , మౌలిక వసతులు
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్య
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలోనే రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను 16 కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎంవైకె లాటిక్రేట్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,. అంగన్వాడి పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతో నిర్మించబోతున్నట్లు తెలిపారు.
ఎంవైకె లాటిక్రేట్ పరిశ్రమ సహకారంతో 16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ కృతిక ద్వారా ఆధునిక వసతులతో నిర్మించనున్నట్లు తెలిపారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మూడు ఎకరాల 34 గంటల స్థలంలో 43,378 చదరపు అడుగుల విస్తీర్ణంతో 15 తరగతి గదులు, మండల పరిషత్ పాఠశాలను ఒక ఎకరా 23 గుంటల స్థలంలో 26,586 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 తరగతి గదులు నిర్మించబోతున్నట్లు తెలిపారు. వీటితోపాటు ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులను నిర్మించబోతున్నట్లు తెలిపారు.
గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేలా పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గ్రామంలోని తల్లిదండ్రులు పాఠశాల బృందానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.త్వరితగతిన పాఠశాల నిర్మాణం పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీటీసీలు రాజు, హరి ప్రసాద్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వర్ నాయక్, ఎంవైకె లాటిక్రేట్ సంస్థ ప్రతినిధి రోహిత్, తదితరులు పాల్గొన్నారు.