ముదిరాజ్ ల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
సబ్బండ వర్గాలు, మన జాతి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా
నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే గుర్తింపు సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నీలం మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రాజకీయ చైతన్యం అలవర్చుకోవాలన్నారు. రాజకీయ చైతన్యంతోనే జాతి మనుగడ సాధ్యమని వివరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్ ల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనతో ముదిరాజులకు మంచి రోజులు రానున్నాయని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు.
ముదిరాజుల సుదీర్ఘ డిమాండ్ అయిన బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే విషయంతో పాటు మత్స్యకార సంఘాలకు వడ్డీ లేని ఋణాలు, చేపల మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మరికొన్ని అంశాలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. దశలవారీగా మన హక్కులను సాధించుకుందామని అన్నారు. సబ్బండ వర్గాలు, ముదిరాజ్ జాతి అభివృద్ధికి శక్తివంచనా లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పెద్దలందరం కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కార సాధనకు కృషి చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్మోహన్, మాజీ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్, డీఎల్ పాండు, చేన్నవేని రాములు, సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చొక్కాల రాములు, చొప్పరి రామచంద్రం, రెడ్డబోయిన గోపి, హనుమండ్లు, వెంకటస్వామి, ముత్యాల శ్రీనివాస్, దేవరాజు, పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.