పటాన్ చెరులో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం

politics Telangana

_పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని భక్తుల జయజయధ్వానాల మధ్య, జై శ్రీరామ్ నినాదాల హోరులో పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. గురువారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు మేళతాళాల మధ్య తమ స్వగృహం నుండి వేడుకగా బయలుదేరి స్వామి వార్లకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అర్చకులు సాంప్రదాయబద్దంగా కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎమ్మెల్యే జిఎంఆర్ సూచనలకు అనుగుణంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సౌకర్యాలు కల్పించారు. పటాన్చెరు పట్టణం మొత్తం విద్యుత్ దీపాల వెలుగులతో నిండి పోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని బండ్ల గూడ, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, నందీశ్వర్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ జైపాల్, మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్, ఆలయ కమిటీ చైర్మన్ మనోహర్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *