గీతం చర్చాగోష్ఠిలో వక్తలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఏదైనా తెలియని అంశం గురించి అడిగి తెలుసుకోవాలని, ప్రశ్నించే తత్త్వం ఆలోచనను పెంపొందించి, పురోగతికి తోడ్పడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్-లోని ట్రైనింగ్ అండ్ కాంపిటెన్స్ క్రాఫ్టర్స్ (టీసీడీ) ఆధ్వర్యంలో ‘పని యొక్క భవిష్యత్తును రూపొందించడం: బహుళ విభాగ నైపుణ్యాలు, జీవితకాల అభ్యాసం, వ్యక్తిగత గుర్తింపు’ అనే అంశంపై మంగళవారం చర్చాగోష్ఠిని నిర్వహించారు. ఇందులో గీతం పూర్వ విద్యార్థులతో సహా విభిన్న పరిశ్రమ అనుభవం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు.బహుళ విభాగ నైపుణ్యాల ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ, సాంకేతిక పురోగతులు అన్ని పరిశ్రమలను పునర్నిర్మిస్తున్నాయని, రంగంతో సంబంధం లేకుండా విభిన్న సామర్థ్యాలను అవలంబించడం చాలా అవసరమని హెచ్ఆర్ కన్సల్టెంట్ నేహా గుప్తా అన్నారు. విద్యార్థులు ధోరణులను గుడ్డిగా అనుసరించవద్దని, ఉపాధిని పెంపొందించే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టాలని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా కన్సల్టెంట్, గీతం పూర్వ విద్యార్థి శ్రీహర్ష సూచించారు. బీటెక్ (ఈసీఈ) చదివిన తాను క్లౌడ్ కంప్యూటింగ్-కి మారిన తన అనుభవాన్ని హిటాచీ వంటారాలో అడ్వాన్స్డ్ క్లౌడ్ కన్సల్టెంట్, గీతం పూర్వ విద్యార్థిని ఐశ్వర్య భాస్కరభట్ట వివరించారు. కొత్త వాటిని నేర్చుకోవాలనే తపన, ప్రశ్నించే తత్త్వం, జీవితకాల అభ్యాసాలు వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడతాయన్నారు.
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సొంత కన్సల్టింగ్ సంస్థను స్థాపించడానికి జరిగిన పరివర్తనపై మూవ్-మెంట్స్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డెలాయిట్ పూర్వ ఉపాధ్యక్షుడు దీపక్ లాల్ మాట్లాడుతూ, నైపుణ్యాలను నేర్చుకోవడం, వాటిని వ్యక్తిగత బ్రాండింగ్-లోకి అనువదించడం, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పరివర్తన ఒక్క రోజులో జరగదని, విద్యార్థులు సరైన దిశలో అవకాశాల కోసం అప్రమత్తంగా ఉండాలని శ్రీహర్ష సూచించారు. వ్యక్తిగత బ్రాండ్-ను పెంచుకోవడానికి లింక్డ్ఇన్ మంచి వేదికని నేహా అభిప్రాయపడ్డారు.సాఫ్ట్ స్కిల్స్, నెట్-వర్కింగ్-లకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇది వారి కెరీర్-పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఐశ్వర్య అన్నారు. విద్యార్థులు తమ సొంత వెంచర్లు ప్రారంభించడానికి వెనుకాడవద్దని, ప్రాథమిక అంశాలపై మంచి అవగాహనను ఏర్పరచుకోవాలని విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు సంధించిన పలు ప్రశ్నలకు ప్యానలిస్టులు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు.
బీటెక్ విద్యార్థులు బి.వంశిక సాయి, ఎం.అక్షిత ఈ చర్చాగోష్ఠిని సమన్వయం చేయగా, డాక్టర్ రూత్ జర్ధోమాని హౌజెల్ వందన సమర్పణ చేశారు. టీసీడీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జీసీజీసీ డైరెక్టర్ డాక్టర్ మమతారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమాకాంత్ బాల్, టీసీడీ ఇంటర్న్స్ వై.వైష్ణవ్ కిరీటి, సంప్రీత్ పార్సి, వినమ్ర వాస్వానీ, పలు విభాగాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.