అమీన్ పూర్:
ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం పని చేస్తోందని శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.
అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం మెగా హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి తో పాటు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బి హెచ్ ఈ ఎల్ మెట్రో ఎంక్లేవ్ పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు.
అనంతరం గ్రామ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పల్లెలు,పట్టణాలు పరిశుభ్రంగా చేసుకొని,అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ఎంతో అభివృద్ధి చేసుకోగలిగామని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని ప్రశంసించారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.