86 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పటాన్చెరు
పటాన్చెరువు డివిజన్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణం నుండి శాంతినగర్ కాలనీ లో 86 లక్షల రూపాయలతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నాడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పటాన్చెరు నేడు గేటెడ్ కమ్యూనిటీలకు ఐకాన్ గా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. శాంతి నగర్ కాలనీలో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం పాత మార్కెట్ లో నిర్మిస్తున్న నాన్ వెజ్ మార్కెట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, నరసింహారెడ్డి, శ్రీధర్ చారి, జిహెచ్ఎంసి అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.