ఘనంగా ప్రారంభమైన ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
క్రీడలకు కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. క్రీడల ద్వారా శారీరకదారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఉపయోగపడతాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో, యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మండల విద్యాధికారి రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్.జి.ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి గోసుద్దిన్, సీనియర్ నాయకులు అఫ్జల్, ప్రమోద్ గౌడ్, వెంకటేష్, మల్లారెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, ఇమ్రాన్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.