క్రీడల కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గం_చదువుతో పాటు క్రీడలు ప్రధానమే మత్తుకు బానిస కావొద్దు

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్చెరు

పటాన్చెరు నియోజకవర్గాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లోను నైపుణ్యం సాధించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తుకు బానిస కావద్దని సూచించారు నూతన సంవత్సరం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు పట్టణానికి మైత్రి క్రీడామైదానం తలమానికంగా మారబోతుందనీ అన్నారు. ఈనెల 26వ తేదీ లోపు మైదానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక నుండి వివిధ క్రీడాంశాల్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం నుండి మెరుగైన క్రీడాకారులను తీర్చిదిద్ది, జాతీయ స్థాయికి పంపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన తాను క్రీడా రంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఇటీవల యువత మత్తుకు బానిస కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని యువత ఎవరు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం టోర్నమెంట్ విజేతగా నిలిచిన కేబీఎన్ టీమ్, రన్నరప్ గా నిలిచిన నిరంజన్ ఎలెవన్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అద్యక్షులు అఫ్జల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, శ్రీధర్ చారి, వెంకటేష్, మైత్రి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *