పోచారం లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

Districts politics Telangana

_పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి

_రాజకీయాలు ఎన్నికలప్పుడే.. దృష్టి అంతా అభివృద్ధిపైనే..

మనవార్తలు ,పటాన్ చెరు:

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడతామని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో మహీధర ప్రాజెక్ట్స్ సౌజన్యంతో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గణపతి గూడెం లో 18 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న అంగన్వాడి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం గ్రామ, గ్రామ ప్రజలతో తనకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. జాతీయ రహదారి నుండి గ్రామం వరకు 28 లక్షల రూపాయల సొంత నిధులతో బిటి రోడ్డు ఏం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు పారిశ్రామిక వేత్తలు, బిల్డర్ల సహాయ సహకారాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

మహీధర ప్రాజెక్ట్స్ ఎండి ప్రశాంత్ రెడ్డి సహకారంతో కోటీ 20 లక్షల రూపాయలతో పోచారం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తు చేశారు. భవిష్యత్తులోను గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బచ్చు గూడెం నుండి లింక్ రోడ్డు, రామ మందిరం, స్వాగత తోరణం పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టామని తెలిపారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసినప్పుడే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా లో మంత్రి హరీష్ రావు తర్వాత ఆ స్థాయిలో నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే విజనరీ లీడర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అని మహీధర ప్రాజెక్ట్ ఎండి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

తాము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేస్తున్నామని, ఎక్కడా కూడా స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరిన దాఖలాలు లేవని, ఇందుకు పూర్తి భిన్నంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పోచారం గ్రామ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరించాలని కోరడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేని గజమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జగన్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్ యాదవ్, గ్రామ ఎంపిటిసి మమతా బిక్షపతి, ఎంపిడిఓ బన్సీలాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *