వేదిక కానున్న గీతం అనుబంధ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ
పత్ర సమర్పణకు ఆహ్వానం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ- కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ‘తప్పుడు కేసుల గతిశీలత (డైనమిక్స్)’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సమావేశాన్ని ఈ ఏడాది ఆగస్టు 21-22 తేదీలలో నిర్వహించనున్నట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, విధాన నిర్ణేతలు, పౌర సమాజ నిపుణులు కలిసి ‘తప్పుడు కేసులు’ అని పిలువబడే ఆరోపణల యొక్క చర్చ, చరిత్ర, అనుభవాలు, సామాజిక ప్రభావాన్ని పరిశీలించనున్నారు. ప్రత్యేకించి లింగం, చట్ట అమలు పద్ధతులు, ప్రజా అవగాహనలపై దృష్టి సారించనున్నట్టు వివరించారు.ఈ కార్యక్రమం చట్ట దుర్వినియోగం కథనం, న్యాయ వ్యవస్థలపై దాని ప్రభావాలు, దాని విస్తృత సామాజిక పరిణామాలపై ఆధారాల సహిత సంభాషణను పెంపొందించడం, ఇతర అధికార పరిధి నుంచి తులనాత్మక అంతర్దృష్టులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఈ సమావేశంలో ఔత్సాహికులు పరిశోధనా పత్రాలను సమర్పించవచ్చని తెలియజేశారు. అమూర్త పత్రాలను (సారాంశాలను) ఫిబ్రవరి 20 లోగా సమర్పించాలని, ఎంపిక చేసిన వాటిని మార్చి 5 నుంచి 14వ తేదీల మధ్య ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించాలని, వాటిపై తుది అంగీకారాన్ని మార్చి 20 లోగా తెలియజేస్తామన్నారు. ముసాయిదా (డ్రాఫ్ట్) పత్రాలను మే 15 లోగా సమర్పిస్తే, వాటిపై అభిప్రాయాన్ని జూన్ 15 లోగా తెలియజేస్తామని, సవరించిన తుది పత్రాలను ఆగస్టు 1 లోగా సమర్పించాలని స్పష్టీకరించారు.ఈ సదస్సు హైదరాబాదులోని కౌటిల్య ప్రాంగణంలో జరుగుతుందన్నారు. భారతదేశం నుంచి పత్ర సమర్పణ చేసేవారు వ్యక్తిగతంగా పాల్గొనవచ్చని, అంతర్జాతీయ స్కాలర్లకు పరిమిత ఆన్ లైన్ భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు.పరిశోధనా పత్రాలను conference@kspp.edu.in కు పంపవచ్చని, అదే మెయిలు ద్వారా ఇతర వివరాలు కూడా తెలుసుకోవచ్చని సూచించారు.
