మనవార్తలు ,హైదరాబాద్:
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు లో పుట్టి హైదరాబాద్ శేరిలింగంపల్లి లో నివాసం ఉంటున్న కవి మోటూరి నారాయణరావు ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద మోటూరి నారాయణరావు తమ కవితను వినిపించబోతున్నారు.
భారత దేశ చరిత్ర లో భాగంగా స్వాతంత్రోద్యమ చరిత్రను, పోరాటాలను వర్ణిస్తూ, భావయుక్తంగా వారు రాసిన “చరిత్ర పుటల్లో-చీకటి అక్షరాలు” అనే కవిత ఈ పోటీలో ఎంపికయింది.ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ “తానా కవితాలహరి” కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది. సరళమైన భాషలో, సామాజిక స్పృహ కోసం రచనలు చేసే మోటూరి నారాయణరావు గారు అంతకుముందు గుండె సవ్వళ్లు అనే కవితా సంపుటి పుస్తకాన్ని ప్రచురించారు.
హైదరాబాద్ లో పాత్రికేయ వృత్తిలో వుంటూ ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ గా సామాజిక సేవా కార్యక్రమాలు, తెలుగు వెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి గా సాహిత్య సేవలు చేస్తూ, వీరు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కవితా అవార్డులు, పురస్కారాలు మరియు కవిరత్న, కళారత్న, సేవా జ్యోతి, మదర్ థెరిస్సా స్మారక పురస్కారం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్స్మారక అవార్డు లాంటి బిరుదులెన్నో పొందారు.ప్రముఖులతో ప్రసంశలు అందుకున్నారు. ఈరోజు హైదరాబాద్ శేరిలింగంపల్లి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన మోటూరి నారాయణరావు గారిని నగర పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.