_సొంత నిధులతో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ..
_విద్యార్థులకు తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలి..
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులను కోరారు.విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, తల్లిదండ్రులు సైతం పూర్తిస్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 4150 మంది విద్యార్థినీ విద్యార్థులకు సొంత నిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ పరీక్ష సామాగ్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల సందర్భంగా సొంత నిధులతో ఉదయం, సాయంత్రం స్నాక్స్ ను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్య వరకు టీవీలు, ఫోన్లు, సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి విద్యార్థి పూర్తిస్థాయి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు నరసింహ, తేజ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.