ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
మహా శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గురుజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్బంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఈ మేరకు ఆలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని వడ్డించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ కోరికలు తీర్చే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయంలో మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉందని, వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ముందుగా ఆలయ అధికారులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం పలికి, సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఉపేంద్ర బాబు, టీడీపి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.