సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్ముతున్న మోడీ
పటాన్ చెరు:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల భజన చేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాడని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు.కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు లో భాగంగా సిపిఎం పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తా లో పెద్ద ఎత్తున రాస్తారోకో ఆందోళన చేపట్టారు. అనంతరం అం తిరుపతిలో నాయకులను పోలీసులు అరెస్టు చేసి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ సర్కార్ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నను ఉత్పత్తిచేసే కార్మికులను బానిసలుగా మార్చే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గత పది నెలలుగా రైతులకు వ్యతిరేకంగా తెచ్చినా చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాటం చేస్తుంటే కనీసం చీమకుట్టినట్టు కూడా మోడీకి లేదని మండిపడ్డారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి రైతులకు నష్టం చేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారని అన్నారు. వారికి అన్ని పార్టీలు మద్దతు గా నిలబడ్డాయన డానికి ఈ బంద్ ద్వారా అది స్పష్టం అయిందని తెలిపారు.
మరోవైపు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే విధంగా స్వాతంత్రం పూర్వం పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో పూర్తిగా మార్చేసి నాలుగు కోడ్స్ గా మార్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్న వాటిపై మాట్లాడేది మోడీకి బీజేపీకి లేదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ సైతం మొదట్లో రైతులకు మద్దతు తెలిపి ఇప్పుడు మాత్రం బిజెపికి అనుకూలంగా మాట్లాడుతున్నారని గల్లీలో మాత్రం తిట్టుకుంటూ ఢిల్లీలో కౌగిలించుకుంటున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సంస్కరణల బిల్లును వెనక్కి తీసుకోవాలని కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అరెస్టయినవారిలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున్. జిల్లా కార్యదర్శి మల్లేశం. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజు. మాణిక్యం. డివిజన్ కార్యదర్శి నరసింహారెడ్డి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.