_పూలే కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తని, ఆయన యొక్క ఆలోచనలు, ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలే చిత్ర పటానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగు వర్గాల వారిని చైతన్య పరచడంలో పాటు వెనుకబడిన వర్గాల బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి విద్యను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అఫ్జల్, దళిత సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.