పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ ల శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహానేత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం మనకు ప్రతిష్టాత్మకమని ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి గెలిపించాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, బిజెపి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని ఇదే అదనుగా నాయకత్వమంతా కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజలలో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందని ప్రచారంలో మన పథకాలే ప్రచారస్త్రాలుగా వినియోగించుకొని విజయం సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జ్ లు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పఠాన్ చెరు ,నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జిలు కాటా శ్రీనివాస్ గౌడ్,రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ,పూజాల హరికృష్ణ, నాయకులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.