– గీతం జాతీయ చర్చాగోష్ఠిలో ప్రొఫెసర్ ఆర్.ఎస్.సర్రాజు
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
భాష సహజ వాతావరణంలో వికసిస్తుందని , సృజనాత్మకత సహజ రూపంలో సంక్రమిస్తుందని , అందువల్లనే ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్చుకుంటారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రో – వెస్ట్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఆర్.ఎస్.సర్రాజు అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో ‘ దక్షిణ భారతంలో హిందీ భాష , దశ – దిశ ‘ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన జాతీయ చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , అధికార భాషగా హిందీని 15 ఏళ్ళలో గుర్తించాలన్న సంకల్పం రాజకీయ కారణాల వల్ల ఇప్పటికీ నెరవేరలేదన్నారు . దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషను ద్వితీయ భాషగా హిందీయేతర రాష్ట్రాలు బోధించాలని ఆయన అభిలషించారు . భారతీయ భాషల్లో సంస్కృతి ప్రతిఫలిస్తుందని , అందువల్ల అన్ని భారతీయ భాషలవారూ హిందీని సులువుగా అర్థం చేసుకోగలరని ఆయన చెప్పారు . హిందీ .. అనుసంధాన భాషగా , సేవా భాషగా , శిక్షణా మాధ్యమంగా తోడ్పడగలదని ఆయన అభిలషించారు . అధునాతన సాంకేతికతను జర్మనీ , రష్యా , చైనా భాషలలోకి తక్షణమే తర్జుమా చేస్తారని , ఆత్మనిర్బర భారత్లో భాగంగా మనదేశం కూడా ఆ దిశలో పయనిస్తోందని చెప్పారు . మనం భారతీయులమని , మన భాష హిందీ అని ప్రొఫెసర్ సర్రాజు స్పష్టీకరించారు .
భిన్నత్వంలో ఏకత్వం , వివిధతలో ఏకత భారతదేశ గొప్పతనమని , భిన్న భాషలు , విభిన్న సంస్కృతుల నిలయమని దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఉన్నత విద్య – పరిశోధన విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ ఎల్.మదార్ పేర్కొన్నారు . హిందీని భారత మాత ‘ బిందీ ‘ ( బొట్టు ) గా ఆయన అభివర్ణించారు . భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో భాగంగా దక్షిణ భారతంలో హిందీ ప్రచార సభలను జాతిపిత మహాత్మా గాంధీ స్థాపించినట్టు ఆయన చెప్పారు . గాంధీ పేరుతో నెలకొల్పిన గీతమ్ గాంధీజీ ఆలోచనలు ముందుకు సాగుతాయని మౌలానా ఆజాద్ కేంద్రీయ ఉర్దూ విశ్వవిద్యాలయం హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ కరణ్సంగ్ ఉత్వల్ అభిలషించారు . హిందీ మాధ్యమం హైదరాబాద్లో పూర్వంనుంచీ చలామణిలో ఉందని , ఇక్కడి సంస్కృతి – సంప్రదాయాలు , కథలు – కవితలు , నాటికలు – నాటకాలలో భాగమెం దన్నారు . కానీ ఉస్మానియా వర్సిటీలో పదిమందితో ఉండే హిందీ విభాగం నేడు ఏకోపాధ్యాయుడికి చేరడం విచాకరమని చెప్పారు .
‘ హిందీ హై హమ్ , వతన్ హె ‘ , బహు భాషల నిలయం మన భారతదేశం అని బిచ్కుందలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రా ముఖర్జీ పేర్కొన్నారు . సంస్కృతి భాషకు మాతృక అని , లిపి కంటే భావం ముఖ్యమంటూ , హిందీని అనుసంధాన భాషగా ఆమె అభివర్ణించారు . హిందీ భాష వచ్చిన వారికున్న ఉద్యోగ అవకాశాలను ఆమె వివరించారు . తొలుత , చర్చాగోష్ఠి సమన్వయకర్త డి.శంకర్ అతిథులను స్వాగతించగా , సహ సమన్వయకర్త డాక్టర్ తాజుద్దీన్ మహమ్మద్ సెమినార్ లక్ష్యాలను వివరించారు . మరో సహ సమన్వయకర్త డాక్టర్ పి.రమేష్ బాబు వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది . ఇందులో ఆంగ్ల భాష విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్పీ చంద్రశేఖర్ , డాక్టర్ డి.సురేష్ కుమార్ , వీఎన్ స్వామి నాయక్ , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు .