శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు ఘన సన్మానం

politics Telangana

– ఘనంగా నిర్వహించిన భాగ్యనగర్ శివాజీ సేవాసమితి

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

శివాజీ మహారాజ్ పరిపాలనలో ఉన్న న్యాయం, ప్రజా సంక్షేమ దృక్పథం, స్వాభిమాన భావం నేటి తరానికి ఎంతో అవసరమని ఆయన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు .కుత్బుల్లాపూర్‌లో భాగ్యనగర్ శివాజీ సేవాసమితి వెల్ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జర్నలిస్టులను సన్మానించారు . అనంతరం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సమాజంలో అవగాహన పెంపొందించడంలో, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జర్నలిస్టులు నిష్పక్షపాత ధోరణితో పనిచేయాలని సూచించారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చూపిన పరిపాలనా నైపుణ్యం, సాహసస్ఫూర్తి ప్రతి నాయకుడికి ఆదర్శమని అన్నారు. మీడియా సమాజానికి దారిదీపంలా పనిచేస్తోందని, విలువల ఆధారిత జర్నలిజం సమాజ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మధ్యవి మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ చరిత్రను యువతలో విస్తృతంగా పరిచయం చేయడంలో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ గౌరవం పరిరక్షణలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌లను శాలువాలు, స్మారక చిహ్నాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర, ఆయన యుద్ధ వ్యూహాలు, ప్రజా పరిపాలనలో చేసిన సంస్కరణలపై ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించారు. దేశభక్తి గీతాలతో కార్యక్రమానికి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.శివాజీ జయంతి సందర్భంగా జర్నలిస్టులకు నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది. సమాజానికి సేవలందిస్తున్న మీడియా ప్రతినిధులను గౌరవించడం ద్వారా శివాజీ మహారాజ్ స్ఫూర్తిని ఆచరణలో నిలబెట్టినట్లయిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *