అమీన్పూర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
మనవార్తలు , అమీన్పూర్:
నియోజకవర్గ పరిధిలోని మూడు మున్సిపాలిటీలలో ప్రజల సౌకర్యార్థం సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శంకర్ హోమ్స్ సమీపంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మూడు ఎకరాల 15 గంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న మాంసాహారం, కూరగాయలు, పండ్లు, పూల మార్కెట్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఒకే ప్రాంగణంలో ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే బొల్లారం మున్సిపల్ పరిధిలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెల్లాపూర్ మున్సిపాలిటీ లో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు తీసుకుని వచ్చే కూరగాయలు, మాంసాహారం కోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.