పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు పటాన్చెరు నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్నారని, కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పరిధిలోని శ్రీకాకుళం సంక్షేమ సంఘం కోసం గతంలోనే సొంత నిధులతో 500 గజాల స్థలం కొనుగోలు చేసి అందించడం జరిగిందని, రెండు రోజుల్లో భవన నిర్మాణ పనులను సైతం ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు సాయి తేజ, అధ్యక్షులు యోగేష్, కూర్మ నాయకులు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.