_82 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
మనవార్తలు,పటాన్ చెరు:
పేదింటి ఆడబిడ్డ వివాహం భారం కాకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన 82 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం తో ప్రారంభమైన ఈ రెండు పథకాలు నేడు లక్ష 116 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 5478 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు