జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
అందరి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామిగా పటాన్చెరు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రజల తోడ్పాటుతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్యాలయం, ఎంపీడీవో, ఎమ్మార్వో, మార్కెట్ కమిటీ, వివిధ సంక్షేమ సంఘాల కార్యాలయాలతో పాటు, మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరులో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించేలా పటాన్చెరులో ప్రాథమిక పాఠశాల నుండి పీజీ కళాశాల వరకు ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం నుండి పాలిటెక్నిక్ కళాశాల సైతం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో గత రెండు సంవత్సరాల క్రితం పటాన్చెరు పట్టణంలో శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని. అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిఎస్పి ప్రభాకర్, తహసిల్దార్ రంగారావు, ఎంపీడీవో యాదగిరి, ఎంఈఓ నాగేశ్వర నాయక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మాజీ జెడ్పిటిసి జైపాల్, గూడెం మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.