పౌర రక్షణ వాలంటీర్లుగా శిక్షణ పొందుతున్న గీతం విద్యార్థులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
అనుకోని విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వ సాయం కోసం వేచి చూడకుండా తక్షణమే తోటి పౌరులకు తగిన సహాయ సహకారాలను అందించే లక్ష్యంతో పౌర రక్షణ వాలంటీర్లుగా గీతం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర & పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల ‘పౌర రక్షణ స్వచ్ఛంద శిక్షణ – సామర్థ్య నిర్మాణం’ కార్యక్రమాన్ని ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేశారు.పౌర రక్షణ, విపత్తు నివారణ, అగ్ని ప్రమాదాలపై ప్రాథమిక జ్జానం, అగ్నిమాపక చర్యలు, గాలింపు, సహాయక కార్యక్రమాలు, ప్రథమ చికిత్స వంటి కీలక అంశాలపై ఇస్తున్న ఈ శిక్షణలో దాదాపు వంద మంది గీతం విద్యార్థులు పాల్గొంటున్నారు. రక్షణ పరికరాలు, అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన పద్ధతులు, ఆయా పరికరాల వినియోగంపై విద్యార్థులు ఆచరణాత్మక అనుభవాన్ని కూడా పొందుతున్నారు.

ఈ శిక్షణ ప్రారంభోత్సవంలో సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ, విపత్తులు, అత్యవసర పరిస్థితులలో అధికారులకు సహాయపడేందుకు శిక్షణ పొందిన స్వచ్ఛంద సేవకుల బలమైన నెట్ వర్కును నిర్మించడం యొక్క ఆవశ్యకతను వివరించారు. అగ్నిప్రమాదాలు, దుర్ఘటలను, అలాగే సహజ లేదా మానవ కల్పిత విపత్తుల వంటి అత్యవసర పరిస్థితులలో సంబంధిత శాఖలకు సహాయపడేందుకు విద్యార్థులకు అత్యంత కీలకమైన నైపుణ్యాలను ఈ శిక్షణలో నేర్పిస్తున్నట్టు పటాన్ చెరు అగ్నిమాపక శాఖాధికారి కె.వి.నాగేంద్ర పేర్కొన్నారు.

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), పోలీసు, అగ్నిమాపక సేవల వంటి సంస్థలతో సమన్వయం చేసుకోవడం, సంక్షోభాల సమయంలో వ్యవస్థీకృత, ప్రభావవంతమైన ప్రతిస్పందన కోసం ఈ శిక్షణ ఉపకరిస్తుందని వారు తెలియజేశారు. విపత్తు నిర్వహణలో సమాజ సంసిద్ధతను బలపేతం చేయడానికి, స్వచ్ఛంద సేవను ప్రోత్సహించడానికి దీనిని నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. అరుదుగా లభించే ఇటువంటి శిక్షణ కార్యక్రమంలో గీతం విద్యార్థులు కూడా ఎంతో ఉత్సుకతతో పాల్గొంటున్నారు.
