మనవార్తలు , తాడేపల్లి :
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 9 నగరాల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జూన్ 18 న శాన్ ఫ్రాన్సిస్కో – బే ఏరియాలో, 19 న సియాటెల్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపిఎనర్టిఎస్ మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ ఎక్కడ, ఏ లోటు రాకుండా శాస్త్రం ప్రకారం కళ్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని తిలకించి భక్తిపరవశంతో పులకించారు. భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదాలు అందించారు .
ఈ సందర్భంగా శ్రీ వై.వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనదేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణముగా తమ స్వస్థలాలకు రాలేక, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం నోచుకోని వేలాది మంది భక్తుల కొరకు అమెరికాలో కళ్యాణోత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
ఏపిఎనర్టిఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ అమెరికాలోని 9 నగరాల్లో ఈ కళ్యాణోత్సవాలు అక్కడి కార్యనిర్వాహక వర్గాల తోడ్పాటుతో నిర్వహిస్తున్నామని తెలియజేసారు. కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారని, కళ్యాణం కన్నుల పండుగలా జరిగిందన్నారు. అలాగే ఈ వారంతం అనగా జూన్ 25 న డల్లాస్, 26 న సెయింట్ లూయిస్ లలో వైభవంగా కళ్యాణం జరుపుటకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జూన్ 30న చికాగో, జూలై 2 న న్యూ ఆర్లీన్స్, 3న వాషింగ్టన్ డి.సి., 9 న అట్లాంటా, 10 న బర్మింగ్ హామ్ – అలబామా లలో శ్రీవారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు – ప్రవాసాంధ్రుల వ్యవహారాలు మరియు ఏపిఎనర్టిఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్ పండుగాయల, రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు శ్రీ పి. చంద్రహాస్, శ్రీ రాజు వేగేశ్న, నాటా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ కొర్సపాటి, ఏపిఎనర్టిఎస్ కో ఆర్డినేటర్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.