మన వార్తలు ,పటాన్ చెరు:
ఎంపిక చేసిన ఔషధాలలో మలినాలను నిర్ణయించే పద్ధతుల కచ్చితత్వం పెంపు, ధ్రువీకరణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్చెరు సమావేశంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని శివజ్యోతి నర్రెడ్డిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వెంకట నారాయణ బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి నాణ్యత, భద్రత, సమర్థతను నిర్ణయించడంలో ఔషధ పరిశ్రమలో విశ్లేషణాత్మక పద్ధతులు ముఖ్య భూమిక పోషిస్తాయని తెలిపారు. ఈ పరిశోధనలో హెఫైనేటెడ్ పద్ధతులను ఉపయోగించి విశ్లేషణాత్మక పద్ధతులు అభివృద్ధి చేశామన్నారు.
బాగా మెరుగుపరచిన ఈ పద్ధతులు సరళమైనవి, అత్యంత ఖచ్చితమైనవి, కఠినమైనవి, తక్కువ సమయంలో ధ్రువీకరించుకోవచ్చని తెలిపారు. మరింత మెరుగైన విశ్లేషణాత్మక విధానం సాధారణ పరీక్షలు, నియంత్రణ మార్కెట్లలో శీఘ్ర ఉత్పత్తిని ప్రారంభించే సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. ఈ విధానం డోలుటెగ్రావిర్, లామివుడిన్, అలాజానావిర్, నిర్దాగ్లిస్టిన్ వంటి ఔషధాలకు అన్వయించినట్టు ఆయన వివరించారు. శివజ్యోతి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు పేర్కొన్నారు.