పటాన్ చెరు:
పారగమ్య స్టెనోస్ట్ ధమనుల ద్వారా న్యూటోనియన్ కాని ద్రవ ప్రవహాల గణిత నమూనా , విశ్లేషణ ‘ దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీన్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వై.ప్రభాకర్ రెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని గణిత శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మారుతీ ప్రసాద్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . స్టెనోజ్ ధమనుల ద్వారా ద్రవ ప్రవాహాన్ని విశ్లేషించడానికి డబుల్ – లేయర్డ్ గణిత నమూనా అభివృద్ధి చేసినట్టు ఆయన తెలియజేశారు . బయోఫ్యూయిడ్ డైనమిక్స్ లో పరిశోధన కోసం , ముఖ్యంగా నోటిక్ ప్రాంత ప్రవాహాలలో ఒక అవకాశం ఉందన్నారు .
ఈ ప్రవాహాల విశ్లేషణ డయాలసిస్ మెషిన్ , కృత్రిమ మూత్రపిండాలు , అవయవాలు మొదలైన జీవ పరికరాలను అభివృద్ధి చేయడానికి , గణిత నమూనాలను రూపొందించడానికి సహాయపడుతుందని తెలిపారు . ఈ నమూనాలు త్రీడీ ప్రింటింగ్ మెషీన్లలో ఉపయోగపడతాయన్నారు . వివిధ శారీరక పరిస్థితులలో స్టెనోటిక్ సమస్యలను పరిశీలించవచ్చన్నారు . మానవ శరీరంలో రక్త ప్రసరణను బాగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనాన్ని వినియోగిస్తారని , ధమనుల వ్యాధుల నిర్ధారణ , నివారణలో వైద్యులకు ఇది సహాయపడుతుందని ఆయన వివరించారు . ప్రభాకర్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
