మూడు రోజుల పాటు కొనసాగనున్న విద్యార్థుల వేడుక అలరించనున్న ప్రముఖులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్షిక ఉత్సవం. ప్రమాణ-2025 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాల మేలు కలయిక అయిన ఈ వేడుక ప్రారంభోత్సవంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ సీహెచ్, రూపేష్ ముఖ్య అతిథిగా, SYNYCS గ్రూపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపకుడు శ్రహంజ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.
విశేషమైన విజయాల కోసం కృషి చేయాలని, అత్యుత్తమ ప్రదర్శనకు తమను తాము సన్నద్ధం చేసుకోవాలంటూ విద్యార్ధులను ఎస్పీ ప్రేరేపించారు. హద్దులను అధిగమించి ఆయా వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా జీవితంలో రాణించాలని శ్రహంజ్ సూచించారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, ప్రమాణ – 2025 అధ్యాపక సలహాదారు డాక్టర్ పి.త్రినాథరావు, డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు, పలువురు అధ్యాపకులు, తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఆయా కార్యక్రమాలలో పాల్గొని, ఈ మూడు రోజుల వేడుకను విజయవంతం చేయాలని వారు కోరారు.
ప్రమాణ-2025 తొలి రోజు గీతం నమూనా ఐక్యరాజ్య సమితి (జీఎంయూఎన్), వయ్యారంగా చీర ధరించే కార్యశాల, క్లాసికల్-ఫ్యూజన్ డ్యాన్స్ పోటీలు, రంగోలి పోటీ, లైవ్ పెయింటింగ్-స్వెచింగ్, డిబేటీ పోటీలు, ఓపెన్ మైక్ లతో పాటు పలు వర్క్ షాపులు, రిక్రియేషనల్ థెరపీ, మెంటల్ హెల్త్ బింగో వంటి ఉత్తేజకరమైన సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రఖ్యాత కళాకారులు నికితా గాంధీ, మంగ్లీ తమ పాటలతో యువతను ఉర్రూతలూగించారు.ప్రమాణ-2025 విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆవిష్కరణ, సమగ్రతను ప్రదర్శించడానికి ఒక శక్తివంతమైన వేదికగా ఉంటుందని హామీ ఇవ్వడమే గాక, అవధులు లేని ప్రతిభా స్ఫూర్తిని చాటిచెబుతోంది.