పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి నేడు బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లీనరీ, టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర మహాసభల విజయవంతం సంపూర్ణ సహకారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కృతజ్ఞత సభ నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఐ జే యు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు రమణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ శాలువా, మెమొంటోతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేయడంతో పాటు, దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
పటాన్చెరు నియోజకవర్గంలోనూ జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 100 మంది జర్నలిస్టులకు 15 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య భద్రత కార్డులు అందించడంతోపాటు, ఇళ్ల స్థలాలను సైతం అందించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.వాస్తవమైన వార్తలు అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు.జాతీయ మహాసభలకు పటాన్చెరును వేదికగా ఎంపిక చేసుకొని సభలను విజయవంతం చేయడం పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.భవిష్యత్తులోనూ జర్నలిస్టులు చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో యూనియన్ జిల్లా, నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.