గీతంలో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం
పలు ఆహ్లాదకర పోటీలలో పాల్గొన్న విద్యార్థులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆరోగ్యం, స్థిరత్వం, ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహించడంలో ఆహారం యొక్క కీలక పాత్ర గురించి అవగాహన పెంచే లక్ష్యంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం-2025ను ఘనంగా నిర్వహించారు. ప్రజలు, భూగోళాన్ని ఏకం చేసే ఆహారం యొక్క శక్తి ఇతివృత్తంగా ఈ కార్యక్రమాన్ని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని లైఫ్ సైన్సెస్ విభాగం ఏర్పాటు చేసింది. ఈ వేడుకల ప్రారంభోత్సవంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతాహర్ రెజా, లైఫ్ సైన్సెస్ విభాగం అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు, పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొని, విలువైన అనుభవాన్ని పొందాలని వారు విద్యార్థులను ప్రోత్సహించారు.జ్జానాన్ని పంచుకోవడం, సృజనాత్మకత, ఉత్సాహంగా సాగిన ఈ వేడుకలను, సమాచారం, వినోదంతో నిండిన కార్యకలాపాల మేలు కలయికగా రూపొందించారు.
ఈ సందర్భంగా పోస్టర్ ప్రెజెంటేషన్, ఆహార కల్తీని గుర్తించే ప్రదర్శన, ఆహార శుద్ధి నమూనాలు, పోషకాహారంపై అవగాహన, వ్యర్థాల నుంచి వినియోగంలోకి, ఆహారం-నిజాలు, అపోహలు వంటి చైతన్యపరచే కార్యక్రమాలలో పాల్గొన్న వారికి ఆహార భద్రత, పోషకాహారం, స్థిరత్వంపై ఆచరణాత్మక, లోతైన అవగాహనను కల్పించాయి.వీటికి అదనంగా ఫుడోగ్రఫీ, గ్రాబ్ ఇట్, సెన్సరీ క్వెస్ట్, పుష్-అప్ పోటీ, హెడ్స్ అప్, క్రాస్ వర్డ్స్ వంటి సరదా కార్యక్రమాలు ఈ వేడుకలలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు శక్తివంతమైన స్ఫూర్తినిచ్చాయి. ఆయా పోటీల విజేతలకు ఉత్తేజకరమైన బహుమతులతో పాటు ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు.లైఫ్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ నిహారిక ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పలువురు విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.