గీతంలో శ్రేష్ఠతకు ప్రోత్సాహకం

Telangana

ప్రతిభావంతులై విద్యార్థులకు ఏస్ అవార్డులు-2026 ప్రదానం

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

శ్రేష్ఠతకు పట్టంకట్టి, ప్రతిభావంతులను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం బుధవారం ఏస్ అవార్డులు-2026ను ప్రదానం చేసింది. ఉత్సాహభరితమైన, చైతన్యవంతమైన ప్రాంగణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, శ్రేష్ఠత, ఆవిష్కరణ, విద్యార్థుల సంపూర్ణ విజయాలను వేడుకగా జరుపుకుంది. విద్య, సాంస్కృతిక, క్రీడా రంగాలలో రాణించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించి, ఇతరులకు ప్రేరణగా నిలిచింది.ఆవిష్కరణ, సాంకేతికత, సృజనాత్మక శ్రేష్ఠత, సామాజిక ప్రభావం, నాయకత్వం వంటి విభాగాలలో అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా ఈ ఏస్ అవార్డులను ఇచ్చి ప్రోత్సహించారు. వీటితో పాటు ఉత్తమ అథ్లెట్ (యువతీ యువకులు), ఈ యేటి మేటి జట్టు (టీమ్ ఆఫ్ ది ఇయర్), వర్ధమాన క్రీడా ప్రతిభ, క్రీడా ప్రదర్శనలో శ్రేష్ఠత వంటి అవార్డుల ద్వారా క్రీడా రంగంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను కూడా సత్కరించారు.అలాగే, విద్యార్థి క్లబ్బులు, ప్రత్యేక ఆసక్తి సమూహాలు (ఎస్ఐజీలు) – వారి సృజనాత్మకత, సహకారం, ప్రాంగణ భాగస్వామ్యానికి చేసిన కృషికి గుర్తింపును ఇవ్వడం ద్వారా బలమైన సామాజిక భావాన్ని పెంపొందించారు.

విద్య, సహ-పాఠ్య రంగాలలో శ్రేష్ఠతను ప్రోత్సహించడం ద్వారా, అన్ని రంగాలలో రాణించే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులను తీర్చిదిద్దాలనే గీతం యొక్క నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రస్ఫుటీకరించింది. అవార్డు గ్రహీతల స్ఫూర్తిదాయకమైన కథలతో తోటివారిలో ప్రేరణ, ఆకాంక్షలను ఈ కార్యక్రమం పెంపొందించింది.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు; రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, విజేతలకు అవార్డులను ప్రదానం చేసి, వారి వెన్నుతట్టి ప్రోత్సహించారు. స్టూడెంట్ లైఫ్ మేనేజర్ ఫిజా అహ్మద్; స్పోర్ట్స్ మేనేజర్ సూరజ్ వాడపల్లి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *