పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం గ్రామంలో గల మహిధర లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కాలనీలో నూతనంగా నిర్మించిన క్లబ్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం గ్రామ పరిధిలో 700 గృహాలతో అత్యాధునిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. కాలనీకి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించాలన్న కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు.. త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మంచినీరు అందిస్తానని హామీ ఇచ్చారు. కాలనీ సమీపంలో గల డంపింగ్ యార్డ్ తరలించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి సైతం సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ఏర్పాటు అవుతున్న నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహీధర ప్రాజెక్ట్స్ సీఎండి ప్రశాంత్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ జగన్, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, ముత్తంగి పిఎసిఎస్ అధ్యక్షులు బిక్షపతి, ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు స్వాతి రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.