గీతంలో ఘనంగా ఇంజనీర్స్ డే ఉత్సవాలు
పటాన్చెరు:
సంక్లిష్టమైన పలు సమస్యలకు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎన్నో సులువైన పరిష్కారాలు చూపి మనందరికీ ఆదర్శంగా నిలిచారని పటాన్చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా నిర్వహించే ఇంజనీర్స్ డేని గీతంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం చిత్రపటాని పుష్పాంజలి ఘటించిన ప్రోవీసీ మాట్లాడుతూ అతి చిన్న డ్యామ్ నిర్మాణం ద్వారా మైసూరు ను ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మార్చారని, మూసీకి నడకలు నేర్పడం ద్వారా హైదరాబాద్ కు వరద ముప్పును తప్పించారని కొనియాడారు.
సముద్రపు కోతను నివారించడానికి ఒక పాత పడవను అక్కడ ముంచడం ద్వారా విశ్వేశ్వరయ్య సమస్యను సులువుగా పరిష్కరించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మోక్షగుండం వద్ద ఎప్పుడూ రెండు కొవ్వొత్తులు, రెండు పెన్నులు ఉండేవని, ప్రభుత్వ పనికోసం సర్కారు కొవ్వొత్తిని వాడేవారని, ప్రభుత్వ పత్రాలపై సంతకానికి సర్కారు ఇచ్చిన పెన్నును వాడేవారని, అదే సొంత పనుల కోసం సొంత క్యాండిల్, పెన్నులను వాడేవారంటూ ఆయన నిబద్ధతను స్మరించుకున్నారు. విశ్వేశ్వరయ్య సేవలను గీతం ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ ఏకే మిట్టల్, బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ లు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు డెరైక్టర్లు, ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు పాల్గొన్నారు.