మనవార్తలు ,పటాన్చెరు:
ప్రాంప్ట్ గామా – రే న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్ ( పీజీఎన్ఏఏఏ ) ద్వారా వివిధ మాదక ద్రవ్యాలు , మందు పాతరలు , పేలుడు పదార్థాలతో పాటు లోహాలు , బొగ్గు ( ఖనిజాలు ) , సిమెంట్ , రేడియో ధార్మిక పదార్థాల వంటి వాటిని గుర్తించవచ్చని భాభా అణు పరిశోధనా సంస్థ ( బార్క్ ) రేడియోఎనలిటిక్స్ కెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎస్ రామాంజనేయులు చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో బుధవారం ఆయన ‘ పరిశోధనలో రేడియో ఎనలిటికల్ పద్ధతుల వినియోగం’పై ఉపన్యసించారు . పీజీఎన్ఏఏఏ సాంకేతికను ప్రయోగశాలలో లేదా వివిధ నమూనాలను ఆన్ – సెట్ విశ్లేషణ కోసం ఉపయోగించ వచ్చన్నారు .
భద్రత , రసాయన , పదార్థ , భూగర్భ , పురావస్తు శాస్త్రాలతో పాటు పరిశ్రమ , వ్యవసాయం , పర్యావరణం , జీవశాస్త్రం వంటి రంగాలలో అణు సాంకేతికతతో గుణాత్మక , పరిమాణాత్మక మూలకాలను ఉపయోగించి వివిధ రకాలుగా వినియోగించడానికి పీజీఎన్ఏఏఏ ప్రక్రియ ఉపకరిస్తుందని డాక్టర్ రామాంజనేయులు వివరించారు . విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులివ్వడమే కాకుండా , వారి నుంచి కొత్త అంశాలను తెలుసుకుంటున్నట్టు చమత్కరించారు . ఆ తరువాత ఇతర శాస్త్రవేత్తలు డాక్టర్ మాధవ బి.మల్లియా , డాక్టర్ ధనదీప్ దత్తాలు కూడా ఇతర అంశాలపై ఉపన్యాసాలిచ్చారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల , గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , డాక్టర్ నరేష్ కుమార్ కటారి తదితరులు బార్క్ శాస్త్రవేత్తలను సత్కరించారు . ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు ( శుక్రవారం వరకు కొనసాగనున్నది .