– గీతం విద్యార్థులకు ఐఎంఎఫ్ఎస్ సీఈవో ఉద్బోధ
మనవార్తలు ,పటాన్ చెరు:
పెద్ద కలలు కని , వాటిని సాకారం చేసుకోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని , ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని ఐఎంఎఫ్ఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ( సీఈవో ) కేపీ సింగ్ అన్నారు . గీతమ్ లోని బీటెక్ , బీబీఏ , బీఎస్సీ , బీఫార్మసీ విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించి , విదేశీ విద్యాకాశాలను వివరించారు . ఈ సందర్భంగా విదేశీ విద్యలో తనకున్న అనుభవాన్ని విద్యార్థులతో పంచుకోవడంతో పాటు వీసా ఇంటర్వ్యూ విధానం , దానికి సంబంధించిన కొన్ని చిట్కాలను ఆయన పేర్కొన్నారు . డిగ్రీ రెండో ఏడాది నుంచే విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని , కోరికలను నిజం చేసుకోవడానికి తగిన ప్రణాళికను రచించుకోవాలని సూచించారు . ఉన్నతస్థాయి ఉద్యోగాలెన్నో ప్రపంచవ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయని , అయితే సరైన అభ్యర్థులు లభించిన వాటిని భర్తీ చేయలేకపోతున్నట్టు ఆయన చెప్పారు .
డిసెంబర్ 2021 నాటికి అమెరికాలో 11 మిలియన్లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని , ఐరోపాలో ఒక మిలియన్ , ఆస్ట్రేలియా – న్యూజిలాండ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయన్నారు . అందువల్ల విదేశీ విద్యను అత్యుత్తమ వర్సిటీలలో అభ్యసించే వారికి పూర్తిస్థాయి నివాసార్హత ( పీఆర్ ) , విద్యార్థి వీసా ( ఎఫ్ -1 ) ఉద్యోగ వీసా ( హెచ్ -1 ) ల రూపంలో అత్యుత్తమ ఉపాధి అవకాశాలున్నట్టు కేపీ సింగ్ పేర్కొన్నారు . ఓ అంచనా ప్రకారం , 2019 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 300 బిలియన్ డాలర్లు , అమెరికాకు 45 , ఆస్ట్రేలియాకు 32 , కెనడాకు 21 , బ్రిటన్ – న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థలకు ఐదు బిలియన్ డాలర్లను విదేశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు అందజేసినట్టు ఆయన వివరించారు . బ్రిటన్ / ఐర్లాండ్ దేశాలలో ఒక ఏడాది ఎమ్మెస్ , మూడేళ్ళ యూజీ కోర్సులను నిర్వహిస్తున్నారని , చదువయ్యాక రెండేళ్ల పాటు అక్కడే ఉండేలా వీసా నిబంధనలను సడలించారని , మరో రెండేళ్ల తరువాత పర్మినెంట్ రెసిడెన్స్ హోదా పొందే అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు .
ప్రతి విద్యార్థి తాను అభ్యసించదలచుకున్న కోర్సుకు అనువైన దేశం , ఏ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉందీ , ప్రవేశార్హతలు , కోర్సు వ్యవధి , చేరదలచుకున్న యేడాది ముందుగా తగిన అర్హతలు సాధించడం వంటిని పూర్తిచేయాలని , అలాగే ఆయా దేశాల స్థానిక భాషపై కూడా పట్టు సాధించాలని కేపీ సింగ్ సలహా ఇచ్చారు . తమకిష్టమైన కోర్సులో చేరాలంటే , ముందుగా టోఫెల్ / ఐఈఎల్టీఎస్ / జీఆర్ / జీమాట్ వంటి స్కోర్లు సాధించాలని , వీసా ప్రక్రియ కోసం సిద్ధపడాలన్నారు . డిగ్రీ విద్యతో పాటు ఇతరత్రా వ్యాపకాలలో రాణించి మంచి మార్కులతో పాటు అత్యుత్తమ ప్రొఫెలను రూపొందించుకోవాలని ఆయన హితవు పలికారు . తొలుత , గీతం లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అధికారి వేణుగోపాల్ అరిగల అతిథిని స్వాగతించగా , శిక్షణాధికారి బి.సంతోష్ కుమార్ వందన సమర్పణ చేశారు . ఈ కార్యక్రమంలో రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , జీసీజీసీ డెరెక్టర్ డాక్టర్ వేణుకుమార్ నాతి , ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ఐఎంఎఫ్ఎస్ డెరైక్టర్ అజయ్ కునూర్ వేములపల్లి తదితరులు పాల్గొన్నారు .