హృదయపూర్వకంగా స్వాగతించిన గీతం నాయకత్వం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జి.ఎస్.హెచ్.ఎస్.) డీన్ గా డాక్టన్ రతిన్ రాయ్ నియమితులయ్యారు. గీతం అనుబంధ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కె.ఎస్.పి.పి.)లో విశిష్ట ఫెలో అయిన డాక్టర్ రాయ్ ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయమైన ఆర్థికవేత్త, పబ్లిక్ పాలసీ పండితుడే గాక విద్యా, పబ్లిక్ ఫైనాన్స్, అంతర్జాతీయ అభివృద్ధిలో అత్యుత్తమ నాయకత్వం వహించారు.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో డాక్టర్ రాయ్ పీహెచ్.డీ., ఎం.ఫిల్. పట్టాలను పొందారు. ప్రస్తుతం ఆయన లండన్ లోని ఓవర్సీస్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ (ఓడీఐ గ్లోబల్)లో విజిటింగ్ సీనియర్ ఫెలోగా సేవలందిస్తున్నారు. ఆయన విశిష్ట కెరీర్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్.ఐ.పి.ఎఫ్.పి.) డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, బ్రెజిల్ లోని యు.ఎన్.డి.పి.లోని ఇంటర్నేషనల్ పాలసీ సెంటర్ ఫర్ ఇన్ క్లూజివ్ గ్రోత్ (ఐ.పి.సి-ఐ.జి)లో డైరెక్టర్ వంటి ప్రముఖ పదవులలో రాణించారు.
వీటికి అదనంగా, డాక్టర్ రాయ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో అనేక సీనియర్ సలహాదారు పదవులను నిర్వహించారు. భారతదేశ 13వ ఆర్థిక కమిషన్ కు ఆర్థిక సలహాదారుగా, భారత ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా జాతీయ విధానానికి డాక్టర్ రాయ్ విస్తృతంగా దోహదపడ్డారు.డాక్టర్ రాయ్ నియామకం జి.ఎస్.హెచ్.ఎస్.కు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఆయన మేధో నాయకత్వం, గొప్ప విధాన అనుభవం, ప్రపంచ దృక్పథం, విద్యా నైపుణ్యం, పరిశోధన ఆవిష్కరణ, సంస్థాగత వృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.డాక్టర్ రతిన్ రాయ్ నియామకాన్ని గీతం నాయకత్వం హృదయపూర్వకంగా స్వాగతించింది. ఆయన దార్శనిక నాయకత్వం, గీతం విద్యా సమాజానికి విలువైన తోడ్పాటును అందించగలదని వారు ఆశాభావం వ్యక్తపరిచారు.
